స్పెషల్ స్టోరీ : టాలీవుడ్ స్టార్స్ ..ఇక్కడ ఎవరి డైరీ ఖాలీ లేదమ్మా!

కరోనా ఏ క్షణాన మొదలైందో కానీ అన్ని రంగాల్లో చాలా మార్పులే తీసుకొచ్చింది. బుఖ్యంగా సినీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. హిట్ తో సంబంధం లేకుండా ఇప్పడు ఒక్కో స్టార్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయంటే దానికి ప్రధాన కారణం కరోనానే. అది తెచ్చిన మార్పే. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ లు సినిమా రిలీజ్ లు లేకపోవడంతో ప్రతీ ఒక్కరి చేతిలోనూ నాలుగైదు సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆది సాయికుమార్ వరకు ప్రతీ ఒక్కరు ఐదేసి చిత్రాలతో డైరీ ఫుల్ అనే బోర్డ్ పెట్టేశారు.

ఎవరిని అడిగిన ఇప్పడు ఒకే మాట ఇక్కడ ఎవరి డైరీ ఖాలీగా లేదమ్మా. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘ఆచార్య’ రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మలయాళ హిట్ ఫిల్హ్ ‘లూసీఫర్’ ఆధారంగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ని కూడా పట్టాలెక్కించారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు.

ఇక తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాలం’ ఆధారంగా మెహర్ రమేష్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’ లోనూ నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరుకు సోదరిగా కీర్తి సురేస్ కనిపించబోతోంది. ఈ మూవీ కూడా చిత్రీకరణ దశలో వుంది. ఇక డీవీవీ దానయ్య నిర్మాణంలో వెంకీ కుడుముల చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇప్పటికి నాలుగు సినిమాలతో బిజీగా వున్న చిరు త్వరలో ‘పుష్ప’ తరువాత సుకుమార్ తోనూ సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

చిరు తరువాత ఇదే రేంజ్ లో బిజీగా వున్న హీరో మాస్ మహారాజా రవితేజ.. ఈ హీరో చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలున్నాయి. ఇందులో కొత్త దర్శకుడు సతీష్ మండవ డైరెక్ట్ చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రీకరణ పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక సుధీర్ వర్మ తో చేస్తున్న ‘రావణాసుర’ త్రినాథరావు నక్కినతో చేస్తున్న ‘ధమాకా’ చిత్రీకరణ దశలో వున్నాయి. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. రాకెట్ స్పీడుతో ఈ మూవీని పూర్తి చేస్తున్నారు. అలాగే చిరుతో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లోనూ కీలక అతిథి పాత్రలో కనిపించబోతూ ఫుల్బిజీగా వున్నారు.

ఆ తరువాత క్యూలో వుంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న పవన్ త్వరలో హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ ని పట్టాలెక్కించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి పూర్తి చేసి మరో రెండు రీమేక్ చిత్రాలని స్టార్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హిట్ చిత్రాలు వినోదాయ సితం థేరీ ల రీమేక్లలో పవన్ నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాలని త్వరలో అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అంటే పవన్ కూడా నాలుగు చిత్రాలతో ప్యాక్ అన్నమాట.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నారు. అందులో’అంటే సుందరానికి’ జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. మరో చిత్రం ‘దసరా’ చిత్రీకరణ దశలో వుంది. నాని నుంచి ఇంత వరకు కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. రామ్ చరణ్ మాత్రం శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూకరి తో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ తరువాత కొరటాల శివ వుంటుందట. మహేష్ ‘సర్కారు వారి పాట’ తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా రాజమౌళితో ఓ సినిమా ఆ తరువాత కొరటాల తో ఓ సినిమా చేయబోతున్నారు.

ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తరువాత కొరటాల శివ తో తన 30 వ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. దీని తరువాత ప్రశాంత్ నీల్ సినిమా వుంటుంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఇప్పటికే ఇద్దరికి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేశారు. నాగచైతన్య కూడా బిజీగానే వున్నాడండోయ్.. లవ్ సింగ్ చద్దా.. థాంక్యూ.. వెంకట్ ప్రభు సినిమా.. అంతే కాకుండా వెబ్ సిరీస్ ‘దూత’లోనూ నటిస్తూ డైరీ ఖాలీలేదంటున్నాడు.

విజయ్ దేవరకొండ ‘లైగర్’ని రిలీజ్ కు రెడీ చేస్తూనే బ్యాక్ టు బ్యాక్ మరో రెండు చిత్రాలని ప్రారంభించేశాడు. పూరి జగన్నాథ్ తో ‘జెజీఎమ్’ శివ నిర్వాణతో రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఆది సాయి కుమార్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఈ కుర్ర హీరో చేతిలోనూ 5 సినిమాలు వుండటం విశేషం. ఇలా మెగాస్టార్ నుంచి ఆది సాయి కుమార్ వరకు ఏ ఒక్క హీరో కూడా ఖలీగా లేడు.. డైరీ ఖాలీగా లేదమ్మా అంటున్నారు.


Recent Random Post: