సుకుమార్ శిష్యుల సందడి కొనసాగుతోంది

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఇటీవలే ఉప్పెన వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో వచ్చాడు. సుకుమార్ శిష్యుడు అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ముద్ర పడి పోయింది. అందుకే పలువురు యంగ్ హీరోలు సుకుమార్ శిష్యులతో సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుచ్చి బాబు తర్వాత సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ కు మంచి పేరు ఉంది. ఇప్పటికే ఈయన కుమారి 21ఎఫ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఆయనతో గీతాఆర్ట్స్ వారు సినిమా ను తెరకెక్కిస్తున్నారు.

సూర్య ప్రతాప్ 18 పేజెస్ సినిమా ను పూర్తి చేసి విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సమయంలోనే ఈయనకు మరో ఆఫర్ తలుపు తట్టినట్లుగా తెలుస్తోంది. యువ హీరో విశ్వక్ సేన్ తో ఈయన తదుపరి సినిమా ఉంటుందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ పాగల్ సినిమా తో పాటు మరో రెండు సినిమా లను లైన్ లో పెట్టాడు. పాగల్ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఇతర సినిమాలు కూడా షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు సూర్య ప్రతాప్ తో విశ్వక్ సేన్ మూవీ పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సూర్యప్రతాప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమాకు ప్రసన్న కథను అందిస్తున్నాడు. నేను లోకల్ చిత్రంతో పాటు త్రినాధ రావు నక్కిన తో కలిసి పలు కథలను అందించిన ప్రసన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథను సిద్దం చేశాడు. ఆ కథకు విశ్వక్ సేన్ ఫిదా అయ్యాడు. ఖచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ ను చేసేందుకు ముందుకు వచ్చాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు అయితే న్యాయం చేస్తాడంటూ సూర్య ప్రతాప్ ను రంగంలోకి దించబోతున్నారట. ఇక బుచ్చి బాబు ప్రస్తుతం స్టార్ హీరోలకు కథలను రెడీ చేస్తున్న విషయం తెల్సిందే. అలా సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు.


Recent Random Post: