‘పుష్ప 2’ కోసం బుచ్చిబాబు సహకారం తీసుకుంటున్న సుక్కూ..?

‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడనే విషయం తెలిసిందే. తన దగ్గర ఎన్నో ఏళ్లుగా దర్శకత్వ శాఖలో పని చేస్తున్న బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్న సుక్కూ.. సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయగలిగాడు. దీంతో డైరెక్టర్ గా బిజీ అయిపోతాడనుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు మళ్ళీ తన గురువు సుకుమార్ వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ‘ఉప్పెన’ సక్సెస్ తరువాత బుచ్చిబాబుకు భారీ ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం పట్టనుంది. అయితే బుచ్చిబాబు తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ నేపథ్యంలో ఇప్పుడు మైత్రీ వారు నిర్మిస్తున్న ‘పుష్ప’ చిత్రానికి బుచ్చిబాబు వర్క్ చేయాల్సి వస్తోందని టాక్ నడుస్తోంది.

అల్లు అర్జున్ తో చేస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని సుకుమార్ డిసైడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన కథ రెడీ చేసిన సుక్కూ.. రెండో భాగం స్క్రిప్ట్ పై దృష్టి సారించారు. దీని కోసం తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సహకారం తీసుకుంటున్నారట. ప్రస్తుతానికి బుచ్చిబాబు రెండో సినిమా రావడానికి ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో.. ‘పుష్ప 2’ కోసం అతన్ని సుక్కు వాడుకుంటున్నట్లుగా టాక్. మరో డైరెక్టర్ వచ్చి టీమ్ లో చేరడంతో ఇప్పుడు ‘పుష్ప 2’ బడ్జెట్ కాస్త పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.


Recent Random Post: