బాలీవుడ్ స్టార్స్ ని ఇరిటేట్ చేస్తున్న ‘పుష్ప’ మేనియా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పుష్ప ది రైజ్’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇక్కడో విశేషం ఏంటంటే ఉత్తరాదిలో మేకర్స్ ఈ మూవీ కోసం ఎలాంటి ప్రచారం చేయలేదు. బాంబేలో ప్రత్యేకంగా స్టేచేసి వారం రోజుల పాటు ప్రమోషన్స్ ని హోరెత్తించలేదు.

కామ్ గా హిందీ వెర్షన్ రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయారు. అయినా సరే అక్కడ మౌత్ టాక్ తో ఈ మూవీ రూ. 100 కోట్ల మార్కుని దాటి భారీ వసూళ్లని రాబట్టింది. దీంతో బాలీవుడ్ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాలు షాక్ లోకి వెళ్లిపోయారు. నో పబ్లిసిటీ.. స్టార్స్ రాలేదు. ప్రచారం చేయలేదు. అయినా ఏంటీ క్రేజ్ అని అవాక్కయ్యారు. ఈ మూవీ నార్త్ లో సాధించిన వసూళ్లు ఇప్పుడు బాలీవుడ్ బిగ్గీస్ ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఏంటీ ‘పుష్ప’ మేనియా..? ఏది వర్కువుట్ అయింది? .. అంటూ బాలీవుడ్ లో ఓరుగా చర్చ జరుగుతూనే వుంది.

పుండు పై కారం చల్లిన చందంగా బాలీవుడ్ మీడియా ప్రతీ హిందీ సినిమా ప్రెస్ మీట్ లో ‘పుష్ప’ వసూళ్లని నార్త్ లో దాని మేనియాని ప్రశంసిస్తూ బాలీవుడ్ హీరోలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారిని ఇరిటేట్ చేస్తూనే వున్నారు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలిబెట్టిన ‘పుష్ప’ ఫీవర్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాలని గట్టిగా తాకుతూ వారి సహనాన్ని పరీక్షిస్తోంది.

‘బాహుబలి’ తరువాత సౌత్ నుంచి భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రికార్డులు సృష్టించిన ‘పుష్ప’ పై ఇటీవల ‘బచ్చన్ పాండే’ ప్రెస్ మీట్ లో అక్షయ్ కుమార్ అన్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

బాలీవుడ్ ఖిలాడీ నటించిన తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’ ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిసనన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హర్షద్ వార్సీ కీలక పాత్రల్లో నటించారు. సాజిద్ నదియా వాలా నిర్మించిన ఈ చిత్రం మార్చి 18న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రమోషనల్ ప్రెప్ మీట్ లో అక్షయ్ కుమార్ కృతిసనన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హర్షద్ వార్సీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ లేడీ రిపోర్టర్ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. టాలీవుడ్ నుంచి వచ్చిన ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. దాని ధాటికి తట్టుకోలేక బాలీవుడ్ చిత్రాలు వెనకబడిపోయాయి. మాసీవ్ కమర్షియల్ మూవీగా రూపొందిన ఈ మూవీ రిజల్ట్ ని మీరు ఎలా చూస్తారు? అని అక్షయ్ కుమార్ ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అక్షయ్ కొంత ఇరిటేట్ కావడం గమనార్హం. ముందు మీ మాటలతో ఏకీభవిస్తున్నానని మాత్రమే సమాధానం చెప్పడంతో అంతేనా? ఇంకా చెప్పండి? అంటూ పొడిగించింది..

దీంతో ‘గంగూబాయి’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది అని చెప్పుకొచ్చాడు. అది వేరే జానర్ ఫిల్హ్ అని దానికి ‘పుష్ప’కు సంబంధం లేదని మరో సారి ప్రశ్నించింది. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ కంటెంట్ తో పాటు కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ లని అందిస్తున్నారని కానీ బాలీవుడ్ లో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ మాత్రమే చేస్తున్నారని అక్షయ్ కుమార్ గాలితీసేసే ప్రయత్నం చేసింది. దీంతో అక్షయ్ కుమార్ కొంత అసహనానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.


Recent Random Post: