రాధేశ్యామ్‌: ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృష్ణం రాజు

బాహుబలి తర్వాత పూర్తిగా పాన్‌ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు ప్రభాస్‌. అలా ‘సాహో’ సినిమాతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను పలకరించాడు. ఈ యాక్షన్‌ డ్రామాకు టాలీవుడ్‌లో మిశ్రమ స్పందన లభించినా హిందీలో మాత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇదే జోష్‌లో రాధేశ్యామ్‌ ద్వారా మరోసారి పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌ పెదనాన్న కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నారట. బుధవారం 81వ పుట్టిన రోజు జరుపుకున్న కృష్ణం రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహాజ్ఞానిగా పరమ హంస పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అందుకోసమే గడ్డం పెంచుతున్నానని చెప్పారు. తన పాత్రతో పాటు ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తైందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇక ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక్క క్లైమాక్స్‌ కోసమే రూ.30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేయడం గమనార్హం. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తుండటం విశేషం. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. నిజానికి యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథ ఎక్కువ ఉంటుందని ఆమధ్య ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఉన్న తక్కువ యాక్షన్‌ కూడా భారీ స్థాయిలో ఉంటుందట.


Recent Random Post: