రిస్క్ చేయడం వల్లనే నిలబడ్డాను: మోహన్ బాబు

రిస్క్ చేయాలి .. రిస్క్ చేయడమంటే ట్రైన్ కి ఎదురెళ్లడం కాదు .. జీవితానికి ఎదురెళ్లడం. నేను చేసిన ప్రతి సినిమా రిస్క్. అలా చేయడం వల్లనే .. అందుకు కాలం కూడా కలిసి రావడం వల్లనే ఈ రోజున ఇక్కడివరకూ వచ్చాను. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా కూడా పెద్ద రిస్క్. నిజానికి ఇది చాలా గొప్ప సినిమా .. ఆడితే ఆడుతుంది .. లేకపోతే లేదు. కేవలం ఒక్క పాట కోసమే కోటి 80 లక్షలు ఖర్చు చేశాము అంటే ఈ సినిమాను ఎంత అంకితభావంతో చేశామో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 18వ తేదీన అందరూ థియేటర్స్ లో చూడండి” అని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు అన్నారు.

ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ .. “నిజంగానే మా నాన్నగారు రిస్క్ చేశారు. కరోనా అని చెప్పేసి అందరూ ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్న సమయంలో మా నాన్నగారు బయటికి వచ్చి ఈ సినిమాను చేశారు. ఇళయరాజాగారు చేసిన ఒక ట్యూన్ బాగోలేదని చెప్పి మళ్లీ ఆయనతో మరో ట్యూన్ చేయించడం మా నాన్నగారికే సాధ్యమైంది. మా నాన్నగారిని హ్యాండిల్ చేయడం విష్ణుకి మాత్రమే సాధ్యమైంది అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ .. మోహన్ బాబు గారు చేసిన ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమా చూసిన తరువాత మోహన్ బాబుగారి సినిమాలో ఆయనకి ఒక డైలాగ్ రాసే అవకాశం వచ్చినా చాలని అనుకున్నాను. నన్ను రచయితగానే కాదు .. దర్శకుడిగా కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు.

అవినీతి సమాజాన్ని ప్రశ్నించే గట్స్ ఉన్న ఒక కథానాయకుడు ఈ సినిమాకి కావాలి .. అందుకే మోహన్ బాబుగారిని ఎంచుకోవడం జరిగింది. ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసిన మోహన్ బాబుగారికి నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పడం గర్వంగా ఫీలవుతున్నాను” అని అన్నారు.

ఇక పోసాని మాట్లాడుతూ .. మోహన్ బాబు వరుస సినిమాలు నిర్మిస్తూ వెళ్లాలనీ అందువలన పరిశ్రమలో అందరికీ ఉపాధి దొరుకుతుందని అన్నారు. సునీల్ మాట్లాడుతూ .. మోహన్ బాబు వరుస సినిమాలు చేస్తూ ఎప్పుడూ చూసినా ఏదో ఒక సెట్లో కనిపించాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఆయన సినిమాలు తగ్గించడం వలన తాము చాలా మిస్సవుతున్నామని చెప్పారు. మంచు విష్ణుకి ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అని అన్నారు.


Recent Random Post: