ఏపీ సీఎం జగన్ తో మంచు విష్ణు భేటీ..!

ంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నేడు టాలీవుడ్ హీరో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయమే విమానంలో బయలు దేరిన విష్ణు.. విజయవాడకి చేరుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మధ్యాహ్నం సమావేశం జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై జగన్ తో మంచు విష్ణు చర్చిస్తారని తెలుస్తోంది.

ఇటీవల సీనియర్ హీరో చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు మహేశ్ బాబు – ప్రభాస్ – రాజమౌళి – కొరటాల శివ – ఆర్ నారాయణమూర్తి – నిరంజన్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రితో భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దల భేటీకి సంబంధించిన కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సినిమా టికెట్ రేట్లు మరియు అదనపు షోల వ్యవహారం ఓ కొలిక్కి తీసుకురావడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ‘మా’ అధ్యక్షుడు స్పందించలేదని సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయి. అందులోనూ మంచు విష్ణు సీఎం జగన్ కు బంధువు కావడం.. వైయస్సార్ సీపీ మద్దతుదారు కావడంతో ఇవి ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా సీఎం జగన్ తో మంచు విష్ణు భేటీ అవుతున్నారు. ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని హైదరాబాద్ లో మంచు మోహన్ బాబు ఇంటిలో సమావేశం అవడంపై రకరకాల వార్తలు వచ్చాయి.

దీని గురించి విష్ణు ట్వీట్ చేయడం.. మళ్ళీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో నేడు జగన్ మోహన్ రెడ్డితో విష్ణు సమావేశం అవుతుందటం ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: