‘ఆచార్య’ ప్లేస్ లో ‘బింబిసార’ ఫిక్స్ అయినట్టే!

కల్యాణ్ రామ్ హీరోగానే కాదు .. నిర్మాతగా కూడా కొన్ని సార్లు సాహసాలు చేస్తుంటాడు. అలాంటి సినిమాల జాబితాలోనే ‘బింబిసార’ను చేర్చుకోవచ్చు. 40 కోట్ల బడ్జెట్ తో ఆయన నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా వ్యవహరించాడు. సోషియో ఫాంటసీ జోనర్లో నడిచే కథ ఇది. ఈ సినిమాలో ఒక బంచ్ లో కల్యాణ్ రామ్ ‘బింబిసార’గా కనిపించనున్నాడు. ఆయన నుంచి వచ్చిన ఫస్టులుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అలాగే పెద్దగా అనుభవం లేని దర్శకుడి చేతుల్లో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును ఉంచడం ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ సినిమాను మొదలు పెడుతున్నట్టుగా .. షూటింగు నడుస్తున్నట్టుగా కల్యాణ్ రామ్ ఎక్కడా చెప్పలేదు. అందువలన అప్ డేట్స్ రాలేదు. చాలా వరకూ సినిమా పూర్తయిన తరువాత పోస్టర్స్ పట్టుకునే ఆయన ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పుడు మొదలుపెట్టారు? ఎలా పూర్తి చేశారు? అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమాలో కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. తెలుగులో సంయుక్త మీనన్ చేసిన మొదటి సినిమా ఇదే.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా క్రిస్మస్ బరిలో దిగనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అప్పటికి ఇంకా పనులు పూర్తి కాకపోవడం వలన అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఇబ్రవరి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి ఈ తేదీన చిరంజీవి – కొరటాల ‘ఆచార్య’ రావలసింది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన ఏప్రిల్ 1వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక ఆ రోజున ప్లాన్ చేసిన ‘సర్కారువారి పాట’ కూడా దాదాపు వాయిదా పడినట్టే.

‘బింబిసార’ను కూడా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక భాగాన్ని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారన్నమాట. మొదటి భాగం విడుదలైన తరువాతనే సెకండ్ పార్టును మొదలు పెడతారని అంటున్నారు. కల్యాణ్ రామ్ తన కెరియర్ లోనే తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథను టచ్ చేస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. అంతా కూడా కల్యాణ్ రామ్ ఇంత బరువును భుజాన కెత్తుకోవడం అంత తేలికైన విషయమేం కాదు అనే అంటున్నారు. మరి ఆయన ప్రయోగాన్ని ప్రేక్షకులు ఎంతవరకూ సక్సెస్ చేస్తారనేది చూడాలి.


Recent Random Post: