ట్రెండీ టాక్: జీవితకు ఇంతమంది శత్రువులా?

`మా` ఎన్నికలు రసవత్తర మలుపు తిరుగుతున్నాయి. సోమవారం నామినేషన్ ల ప్రక్రియ కూడా మొందలు కావడం.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో `మా` ఎన్నికలు మరింతగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో నటీనటులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. పరస్పరం విమర్శలతో `మా` ఎన్నికలు మరో టర్న్ తీసుకుంటున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్.. మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీకి దిగుతున్న పృథ్వీల మధ్య ఆసక్తికర సంఘటనలు.. విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

సోమవారం జనరల్ సెక్రటరీగా నామినేషన్ దాఖలు చేసిన జీవితా రాజశేఖర్ తాజాగా నటుడు పృథ్వీరాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీ చేస్తున్న పృథ్వీ చేసిన ఆరోపణలు బాధించాయని ఈ సందర్భంగా జీవిత తన ఆవేదనని వ్యక్తం చేసింది. నామినేషన్ అనంతరం మీడియాతో ముచ్చటించిన జీవిత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన మంత్రి ఎన్నికల కంటే `మా` ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని.. అయితే ఎన్నికల వేళ ఎన్ని వివాదాలు వచ్చినా తామంతా ఫైనల్ గా ఒక్కటేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత ఆరోపణలతో పరిశ్రమ పరువు తీయవద్దని ఈ సందర్భంగా జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. పృథ్వీ వ్యాఖ్యలు ఆవేదన కలిగించాయని.. తన వ్యాఖ్యలు చిన్న పిల్లాడి మాటల్లా వున్నాయన్నారు. `మా` అనేది తలెత్తుకునేలా వుండాలని.. రెండు ప్యానెళ్ల గురించి మాట్లాడటం బాధగా వుందనన్నారు.

వ్యక్తిగత రాజకీయాల కోసం ఈ ఎన్నికలని తప్పుదారి పట్టించొద్దన్నారు. ఒకరినొకరు విమర్శించుకోకుండా ఎన్నికలు సజావుగా జరగాలని ఆమె ఆకాంక్షించారు. పరిశ్రమలో రెండు గ్రూపులు ఎందుకు ఉండకూడదని ఎదురుప్రశ్నించిన జీవిత ఎన్నికల్లో పోటీతత్వం వుండాలని అయితే అది శతృత్వం మాత్రం కాదన్నారు.

జీవితపై బండ్లకు ఇతరులకు కోపం ఎందుకని?

`మా` ఎన్నికల సమరం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల తేదీ తగ్గర పడుతున్నా కొద్దీ సినిమాలో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ల తరహాలో రసవత్తర మలుపు తిరుగుతోంది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న అభ్యుర్థులైన ప్రకాష్ రాజ్.. హీరో మంచు విష్ణు రహస్య విందులకు తెరలేపుతున్నారు. గ్రూపు రాజకీయాలతో `మా` ఎన్నికల సమరాన్ని రాజకీయ ఎన్నికల సమరంగా మారుస్తున్నారు.

ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించి తనతో కలిసి వచ్చే వారికి ప్రత్యేకంగా విందుని ఏర్పాటు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై బండ్ల గణేష్ ఘాటు విమర్శలు గుప్పించాడు. తాజాగా మంచు విష్ణు కూడా ఇగదే తరహా సీక్రెట్ విందుని ఏర్పాటు చేయడంతో `మా` ఎన్నికల సమరం గ్రూప్ రాజకీయాలు.. సీక్రెట్ విందులుగా మారి వార్తల్లో నిలుస్తోంది.

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలకు దిగుతున్నారు. అక్టోబర్ 10న `మా` ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఊహించని ట్విస్ట్. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీపడుతున్న జీవితా రాజశేఖర్ పై రెబల్ గా ఎదురు తిరిగారు బండ్ల గణేష్. జీవితపై గెలవడమే ధ్యేయంగా అతడు పోటీబరిలో స్వతంత్రుడిగా పోటీపడుతున్నారు. ఓ వైపు బండ్ల తీరు ఇలా ఉంటే సీనియర్ నటుడు పృథ్వీ ఎటాక్ తెలిసిందే. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీ ఇటీవల ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

ప్రస్తుతం `మా` సెక్రటరీగా పనిచేస్తున్న జీవిత ఆ పదవిని అడ్డుపెట్టుకుని `మా` కార్యాలయాన్ని ఎన్నికల క్యాపెయిన్ కి వాడుకుంటోందని.. తనకు ఓటేస్తే తాత్కాలిక సభ్యత్వాలు ఇస్తాని ఓటర్లని మభ్యపెడుతోందని తనకు ఓటేస్తే ఇలాంటివి చాలా లాభాలు వుంటాయని చెబుతూ ప్రచారం చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. అమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నటుడు పృథ్వీ ఎన్నికల అధికారిక రాసిన లేఖలో పేర్కొనడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా వివాదంపై జీవిత స్పందిస్తూ.. ఆవేశాలపై నీళ్లు చల్లుతూ మేమంతా ఒకటే అనడం కూడా చర్చనీయాంశమైంది.


Recent Random Post: