సైలెంట్‌గా మొదలైన మెగాస్టార్‌ 153

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం 152వ సినిమా ‘ఆచార్య’ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ మరో రెండు మూడు నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆచార్య సినిమా తర్వాత చిరు చేయబోతున్న రెండు సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యాయి. అందులో ఒకటి తమిళ హిట్‌ మూవీ ‘వేదాళం’ రీమేక్‌. తెలుగులో వేదాళంకు చాలా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు మెహర్‌ రమేష్‌ రూపొందిస్తున్నాడు. అధికారికంగా సినిమా ప్రకటన అయితే రాలేదు కాని సినిమాకు సంబంధించిన పనులు మాత్రం చాలా నెలలుగా జరుగుతున్నాయి.

తాజాగా మెహర్‌ రమేష్‌ షూటింగ్‌ కూడా ప్రారంభించాడు. చిరంజీవి లేకుండానే కొన్ని కీలకమైన సన్నివేశాలను కోల్‌కత్తాతో పాటు కీలక ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాడు. సినిమాలో భాగంగా ఒక దసరా ఉత్సవం ఉంటుంది. దాన్ని చిరంజీవి లేకుండానే షూట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత చిరు షాట్స్‌ ను అందులో కంపోజ్‌ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చిరంజీవి వేదాళం రీమేక్‌ పట్టాలెక్కింది. ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్‌ లేకుండా రీమేక్‌ షూటింగ్‌ లో చిరు జాయిన్‌ అవుతాడని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఆచార్య వచ్చిన కేవలం రెండు నెలలకే వేదాళం రీమేక్‌ తో కూడా చిరంజీవి ప్రేక్షకులమ ఉందుకు వస్తాడని అంటున్నారు. మెహర్‌ రమేష్‌ కు ఈ సినిమా ఎంతో కీలకం. ఆయనకు మంచి దర్శకుడు అన్న పేరున్నా కూడా వరుస ఫ్లాప్‌ ల వల్ల కెరీర్‌ లో అయిదు ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ తో అయినా రమేష్‌ మళ్లీ బిజీ అయ్యేనో చూడాలి.


Recent Random Post: