చెల్లెలి పాత్రలపై మక్కువ చూపిస్తున్న మహానటి..!

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి.. దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలుగొందుతోంది. ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు పాత్ర నచ్చితే హీరో చెల్లెలిగా కనిపించడానికి కూడా వెనుకాడటం లేదు.

కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతం అర డజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మూడు చిత్రాల్లో హీరో చెల్లెలి పాత్రలే అవడం గమనార్హం. సూపర్ స్టార్ రజినీకాంత్ – మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”అన్నాత్తే” చిత్రంలో కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రజినీ కి సోదరిగా మహానటి కనిపించనుంది. అది కూడా స్టెప్ సిస్టర్ పాత్ర అని తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు మెహర్ రమేష్ కాంబోలో రూపొందుతున్న ”భోళా శంకర్” సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి నటించనుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. రాఖీ పండుగ స్పెషల్ గా విడుదలైన చిరు – కీర్తి పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇది తమిళ్ లో అజిత్ కుమార్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. అక్కడ లక్ష్మీ మీనన్ చేసిన పాత్రలోనే ఇప్పుడు కీర్తి కనిపించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ఇకపోతే తమిళ్ లో కీర్తి సురేష్ ”సాని కాయిదమ్” అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాతో నటుడిగా మారుతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ లో కీర్తి సురేశ్ – సెల్వరాఘవన్ ఇద్దరూ చేతిలో కత్తులు – తుపాకులు పట్టుకొని డీ గ్లామరైజ్డ్ లుక్ లో అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇందులో వీరిద్దరూ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా మహానటి కీర్తి సురేష్ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా కాకుండా చెల్లెలి పాత్రల్లో నటిస్తోంది. అయితే ఈ సినిమాల్లో తన పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యత వుండటం వల్లనే కీర్తి అలాంటి క్యారక్టర్స్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా స్టార్ హీరోయిన్ గా కెరీర్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నప్పుడు అమ్మడు అలాంటి పాత్రలు చేయడం సాహసమనే చెప్పాలి. కాకపోతే ఈ బ్యూటీకి హీరోయిన్ గా చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ నే సిస్టర్ గా నటిస్తున్నందుకు ఇస్తున్నారని సమాచారం.

ఇదిలా వుండగా కీర్తి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ లో కళావతి గా కనిపించి ఆకట్టుకుంది. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలానే అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక మోహన్ లాల్ తో కలిసి చేసిన ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ సినిమాని కేరళలో థియేటర్ల పరిస్థితి బాగున్నప్పుడు విడుదల చేయాలని చూస్తున్నారు. వీటితో పాటుగా కీర్తి సురేష్ ‘వాశి’ అనే మలయాళ సినిమా – వడివేల్ తో ఓ తమిళ్ ప్రాజెక్ట్ సైన్ చేశారని టాక్ వినిపిస్తోంది.


Recent Random Post: