వేట ముమ్మరం..! భార్గవ్ రామ్ మహారాష్ట్రలో.. గుంటూరు శ్రీను కర్ణాటకలో..!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ఆచూకిపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం లభించినట్టు తెలుస్తోంది. భార్గవ్ రామ్ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్టు తెలియడంతో ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది. జనవరి 5న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ప్రవీణ్ రావు సోదరుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. అనంతరం వారిని వదిలేసి పరారయ్యారు.

తర్వాత వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తమ ఆచూకీ పోలీసులకు తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు పడేశారు. అయితే.. టెక్నాలజీ ఆధారంగా వీరి ఆచూకీ తెలిసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆరోజు ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసే సమయంలో వీరు కారులో ఉన్నారా.. లేదా ఇంట్లోకి వెళ్లారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే.. వీరిద్దరూ ఒకే కారులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ కు ముందు రోజు నుంచి వీరిద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో పోలీసులు కనుగొన్నారు.


Recent Random Post: