సీనియర్ నటికి అండగా నిలిచిన సీఎం..!

సీనియర్ నటి వాణిశ్రీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నందమూరి తారకరామారావు – అక్కినేని నాగేశ్వరరావు – శోభన్ బాబు – కృష్ణంరాజు – కృష్ణ.. వంటి దిగ్గజ నటుల సనసన హీరోయిన్ గా నటించిందామె. తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. తర్వాతి రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ తోనూ ప్రేక్షకులను అలరించింది. అయితే ఆమెకు ఓ పెద్ద సమస్య రావడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలిచి దాన్నుంచి గట్టెక్కించారు.

వివరాల్లోకి వెళ్తే చెన్నైలో నివాసం ఉంటున్న వాణిశ్రీ.. చూలైమేడులో కొంత భూమిని కొనుగోలు చేసింది. అయితే అక్రమార్కులు కొందరు దాన్ని కబ్జా చేశారు. 2011లో ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకున్నారు. వాణిశ్రీ తన భూమి ఆక్రమణకు గురైందని గమనించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆశ్రయించింది. కానీ ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు.

అయితే సెప్టెంబరు 2021లో తమిళనాడు ప్రభుత్వం 1908-రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించడంతో పెద్ద ఉపశమనం లభించింది. దీని ప్రకారం నకిలీ పత్రాలు – అక్రమార్కుల సాయంతో చేసే ఆస్తుల లావాదేవీలను రద్దు చేసే అధికారాలను రిజిస్ట్రేషన్ అధికారులకు కల్పించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వాణిశ్రీ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించింది.

ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆ భూమి పత్రాలను వాణిశ్రీకి అప్పగించారు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. 11 ఏళ్ల పోరాటం తర్వాత తన ఆస్తి తనకు దక్కినందుకు వాణిశ్రీ సంతోషించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ కు వాణిశ్రీ కృతజ్ఞతలు తెలియచేశారు.

“నేను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయాను. అన్నీ ప్రయత్నించి భూమిని పోగొట్టుకుంటానని అనుకున్నాను. కానీ సీఎం స్టాలిన్ మార్గం చూపారు. ఆయన దీర్ఘాయుష్షుతో సుపరిపాలనను కొనసాగించాలని కోరుకుంటున్నాను” అని వాణిశ్రీ అన్నారు.

ఇకపోతే దక్షిణాదిలో అప్పట్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ‘మరపురాని కథ’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. ‘సుఖదుఃఖాలు’ సినిమాలోని ‘ఇది మల్లెల వేళయనీ’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంది. జయసుధ – జయప్రద – శ్రీదేవి వచ్చే వరకూ అగ్ర హీరోయిన్ గా రాణించింది.


Recent Random Post: